మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉండగానే తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 9న ఉదయం 11 నుంచి ఓటింగ్ జరుగుతుంది. రేపు(బుధవారం) మధ్యాహ్నంలోపు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. దీంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు స్కెచ్లు వేస్తున్నాయి. ప్రతిసారి అధికార పక్షానికే పదవి దక్కుతుంది. ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనందున డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.
డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల ఓటింగ్లో 243 మంది సభ్యులు పాల్గొంటారు. మేజిక్ ఫిగర్ 122 అవుతుంది. సభలో బీజేపీకి 73 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్న అన్నాడీఎంకే, టీఆరెస్ సభ్యులను పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ బలం 109. కాంగ్రెస్ సహా ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ సభ్యులతో కలిపితే ప్రతిపక్షాల బలం 110. ఇటు వైసీపీ ఎన్నికకు దూరంగా ఉంటుందని ఇదివరకే ప్రకటించింది.