త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన పొరపాటుతో నెటిజన్లకు అవకాశం ఇచ్చారు. ప్రధాని మోదీకి రోజుకో ప్రశ్న వేస్తూ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాకరేపుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి పప్పులో కాలేశారా? ఇవాళ ఆయన సంధించిన ఏడో ప్రశ్నలో గణాంకాలు చూస్తే అందరికీ అదే అనుమానం వస్తుంది. వంటగ్యాస్, కూరగాయలు, ఇంధనం సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రధాని మోదీని ట్విటర్ వేదికగా నిలదీశారు.
2014 నుంచి 2017 వరకు నిత్యవసర సరకుల ధరలు ఎంత శాతానికి పెరిగాయో ఓ టేబుల్ ద్వారా వివరించారు. ధరల వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కానీ పెరుగుదల శాతం వివరాలు మాత్రం తప్పుగా పేర్కొన్నారు. కందిపప్పు ధర కిలో రూ.45 నుంచి రూ.80కి పెరిగిందని వివరిస్తూ 77 శాతం ధర పెరిగిందని చెప్పాల్సింది పోయి 177 శాతం పెరిగిందని పేర్కొన్నారు. టమాటా ధరలు 185 శాతం పెరిగినట్టు చెప్పబోయి 285 శాతం పెరిగాయనీ... ఉల్లిపాయల ధరలు 100 శాతం పెరిగితే 200 శాతం పెరిగాయనీ.. పాల ధర 31 శాతం పెరిగితే 131 శాతం పెరిగిందనీ... డీజిల్ ధరలు 13 శాతం పెరిగితే 113 శాతం పెరిగినట్టు రాహుల్ పేర్కొన్నారు. దాంతో గణితం కూడా రాని రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలా అవుతారు అంటూ నెటిజన్లు సోషల్మీడియాలో కామెంట్లు గుప్పిస్తున్నారు.