2019 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక సూత్రధారి కాబోతున్నారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్కు సారథ్యం వహిస్తారని, మళ్లి దేశ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషిస్తారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజ కీయ పార్టీల నాయకులు ఈ విషయాన్ని అంతర్లీ నంగా ధ్రువీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హస్త ముద్రను తనపై నుంచి తొలగించుకుని వ్యక్తిగత గుర్తింపు కోసం ప్రణబ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యాయమ్నాయంగా నేతల్ని ఏకం చేసి 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ(82) నిలవబోతున్నట్లు జాతీయ మీడియా సంస్థ ‘ఎన్డీటీవీ’ బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ విషయంపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడగా ఇది నిజమేనని అనిపిస్తున్నట్లు ‘ఎన్డీటీవీ’ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలూ లేకపోలేదని కొందరు నేతలు చెప్పినట్లు వెల్లడించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభకు ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, దానికి ఆయన సమ్మతించడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్గాలు ఈ పరిణామంతో విస్తుబోయాయి. వచ్చే నెల 7వ తేదీన నాగ్పూర్లో ఈ కార్యక్రమం జరగనుంది.