ఉత్తర ప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఓం ప్రకాశ్ రాజ్భర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... పేదలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. మంచి చేస్తామన్న వారికి ఓట్లు వేయడం లేదని, మాంసం, మందు ఇచ్చేవారికే ఓట్లేస్తున్నారని అన్నారు. కోడి మాంసం, మందు ఇస్తే చాలు పేద ప్రజల ఓటు దక్కినట్టేనని ఓం ప్రకాశ్ అన్నారు. రాజకీయ పార్టీలకు ఓటు వేయడానికి పేద ప్రజలు ఆల్కహాల్ తీసుకుంటారని, చికెన్ తింటారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం పార్టీలు పేద ప్రజలకు ట్రీట్ ఏమీ ఇవ్వవని కానీ చికెన్ ఇస్తాయంటూ పేర్కొన్నారు. వారి ఓట్లతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని, కానీ ఆయా పార్టీల నేతలు గెలిచాక మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు వారిని పేదలుగానే చూస్తారని అన్నారు. ఆ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న సదరు నేత పేదలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వివాదం రాజుకుంది. గతంలోనూ ఓం ప్రకాశ్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.