తొలి విడుతలో పేరు లేనందుకు కొంత ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 35 యేళ్లకు పూర్వం తనకు ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. తర్వాత ప్రకటించే జాబితాలో తన పేరుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ టిక్కెట్ను తెలంగాణ జన సమితికి కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు తొలి జాబితాలో టిక్కెట్ కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న పొన్నాల పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. పార్టీకి తాను చేసిన సేవలను వారికి గుర్తుచేస్తూ జనగామ టిక్కెట్ను తనకే కేటాయించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగామ టిక్కెట్ను తెలంగాణ జన సమితికి కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెజస కూడా ఆ టిక్కెట్ కోరుతున్నట్లు ఎక్కడా సమాచారం లేదని కోదండరామ్ ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదన్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ వదులుకోవాల్సి వస్తోందన్నారు. రెండో జాబితాలో తనకు టిక్కెట్ కచ్చితంగా వస్తుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం చేయకపోతే ప్రత్యర్థికి మననే ఆయుధం అందించినట్లు అవుతుందని పొన్నాల అన్నారు.