హైదారాబాద్ పోలీసులు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కార్లు, జీపులు, బైక్లు ఇలా రొటీన్కి భిన్నంగా స్ట్రీట్ పెట్రోలింగ్ని సైకిల్పై చేపట్టనున్నారు. గల్లీల్లో గస్తీ నిర్వహించడానికి ప్రత్యేక సైకిళ్లు వినియోగించాలని నిర్ణయించారు. పంజగుట్ట పీఎస్ పరిధిలో ఐదు సైకిళ్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు పోలీసులు.
ఇప్పటి వరకు పోలీసులంటే బైక్, జీపు, కార్లను ఉపయోగించేవారు. స్ట్రీట్ పెట్రోలింగ్కి వాటినే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసుల స్టైల్ మారింది. చేతిలోకి సైకిల్ వచ్చింది. బ్లూకోల్ట్స్, ఇన్నోవాలు, ఇంటర్సెప్టార్ వాహనాలు చిన్న చిన్న గల్లిలోకి వెళ్ళలేవు కాబట్టి గల్లీల్లోనూ గస్తీ చేపట్టేందుకు సైకిళ్లను ఉపయోగించనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిటీ పోలీసులు.
ఈ సైకిల్స్ బ్యాటరీ సాయంతో పని చేస్తాయి. గస్తీ పోలీసుల అవసరాలకు అనుగుణంగా ఈ సైకిల్ ను డిజైన్ చేశారు. లాఠీ, వాటర్బాటిల్ పెట్టుకునే విధంగా, సైరన్తో పాటు జీపీఎస్ విధానం కూడా సైకిల్ కి అమర్చారు. దీంతో పాటు ఎప్పటికప్పడు సమాచారం ఇవ్వడానికి వాకీటాకీ, సెల్ఫోన్, డైరీలను తమ వెంట తీసుకువెళ్ళడానికి అనువుగా సైకిల్ లో ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు ప్రథమ చికిత్సకి సంబంధించిన పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
నేరాలు అరికట్టడం, మారుమూల ప్రదేశాలకి సులువుగా చేరుకొని సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు పోలీస్ అధికారులు. ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ఎల్లారెడ్డిగూడ, ఆనంద్నగర్ కాలనీ, సోమాజిగూడలోని స్లమ్ ఏరియాల్లో, గల్లీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్బీపీ వ్యవస్థ పని చేస్తుంది. ఈ ప్రయోగం సక్సస్ అయితే రాచకొండ, సైబరాబాద్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు హైదరాబాద్ పోలీసులు.