రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం నేడు (గురువారం) ఎన్నిక జరగనుంది. దీంతో అధికారా విపక్షాల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అర్ధం కాక అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల ఉమ్మడి అబ్యర్ధిగా కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. ఎవరికీ వారు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్గా గెలిచేందుకు కావలసిన సభ్యుల సంఖ్య 123 మంది. ఇప్పుడున్న అంచనా ప్రకారం అధికార పార్టీకి 115 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు అర్ధమవుతోంది. అలాగే విపక్షాలకు 111 మంది ఉన్నారు. అయితే తమకు 126 మంది ఎంపీల బలముందని ఎన్డీఏ చెబుతోంది. ఎన్నిక సమయానికి బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు తమకే ఉంటుందని బీజేపీ భావిస్తోంది. దీంతో విజయం ఎన్డీఏ అభ్యర్థి వైపే ఉంటుందని అంటున్నారు.