టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. తెగ మదనపడిపోతున్నారు. పార్టీలో తనకు కనీస గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి తనను పిలవకపోవడం బాధ కలిగించిందని బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డిపైనా మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ఉన్నన్నాళ్లూ పార్టీని భ్రష్టుపట్టించి.. చివరకు నిండా ముంచేసి జంప్ అయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ టీడీపీకి సరైన నాయకత్వం లేదని మరోసారి అన్నారు మోత్కుపల్లి. సరైన నాయకులు, నాయకత్వం లేకపోవడం వల్లే.. పార్టీ పరిస్థితి దుర్భరంగా తయారైందని చెప్పారు.
తెలంగాణలో కిందిస్థాయిలో టీడీపీకి మంచి కేడర్ ఉందన్నారు మోత్కుపల్లి. తమకు కొంత సమయమిచ్చి.. అవకాశం ఇస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా టీడీపీని నిలబెడతామన్నారు.
టీఆర్ఎస్తో తమకు ఎలాంటి వైరుద్యాలు, విభేదాలు లేవన్నారు మోత్కుపల్లి. అవసరమైతే.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకుంటేనే.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి మెరుగువుతుందని మోత్కుపల్లి అన్నారు. ఆయన వచ్చి.. ఇక్కడి తిరిగితేనే.. పార్టీ బాగుపడుతుందని చెప్పారు.