గోషామహల్ బీఎల్ ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జెండర్ చంద్రముఖి మిస్సింగ్ మిస్టరీ వీడింది. కనిపించకుండా పోయిన కొన్ని గంటల్లోనే చంద్రముఖి ఆచూకీ కనుగొన్నారు. ఈ ఉదయం తమ ముందు ప్రవేశపెట్టాలంటూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు బుధవారం అర్ధరాత్రి సమయంలో చంద్రముఖిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. సంచలనం సృష్టించిన చంద్రముఖి అదృశ్యం కేసు ఎట్టకేలకు వీడింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ నుంచి గోషామహాల్ అభ్యర్థిగా బరిలో నిల్చున్న ట్రాన్సజెండర్ చంద్రముఖి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించకుండా పోయింది. సీసీ టీవీ ఫూటేజ్, కాల్ లిస్ట్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్తో పాటు అనంతపురం, విజయవాడ తదితర ప్రాంతాల్లో 10 పోలీసు ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలింపు చేపట్టాయి.
ఇటు హైకోర్టులో చంద్రముఖి తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం అత్యవసర విచారణను చేపట్టింది. తన కూతురును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసులు వెంటనే ఆమెను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలంటూ పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం చంద్రముఖిని ఈ ఉదయం 10 గంటలా 15 నిముషాలకు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ, బంజరాహిల్స్ sho కి నోటిసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో చంద్రముఖి ఆచూకిని కనుగొన్న పోలీసులు ఆమెను ఈ ఉదయం ఉన్నత న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఆమె కిడ్నాప్కు గురైందా..? లేక కావాలనే అదృశ్యం అయ్యిందా..? అన్నదానిపై పోలీసులు వివరణ ఇవ్వనున్నారు.