అందాల పోటీలపై రగడ తారాస్థాయికి చేరుకుంది. మిస్ వైజాగ్ కాంటెస్ట్పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. సాయంత్రం ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో పోటీలను అడ్డుకునేందుకు మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. అందాల పేరుతో అంగాంగ ప్రదర్శన ఏంటని మంత్రి గంటా ఇంటి ముందు మహిళలు ధర్నా చేస్తున్నారు. మరోవైపు కళలకు మారుపేరైన విశాఖలో పాశ్చాత్య పోకడలేంటని స్వామీజీలు కూడా తప్పు పడుతున్నారు. తక్షణమే అందాల పోటీలపై ప్రభుత్వాధికారులు స్పందించాలని, మిస్ వైజాగ్ ఫైనల్స్ను నిలిపివేయాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఏడాది అందాల పోటీలకి నిర్వాహకులు 26 మంది యువతులను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫైనల్స్ పోటీ నిర్వహించబోతున్నారు. దీనికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు గంటాను కలిసి పోటీలను రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు పోటీలకు వెళ్లొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి మాత్రం అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతాన్నారు.
మిస్ వైజాగ్ పోటీలపై ప్రారంభం నుంచే వివాదాలు నెలకొన్నాయి. పోటీల ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో కూడా ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయిందని మహిళా సంఘాలు వాపోతున్నాయి. అత్యాచారాలు జరిగినపుడు నిందితులపై చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, మహిళలపై నిరంకుశ విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన మంత్రి ఆధ్వర్యంలోనే అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహణను అడ్డుకుని తీరతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.