మంత్రులు, టీఆర్ఎస్ నేతల ఆరోపణలకు మందకృష్ణ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవడంలో కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకోవాలంటూ సలహానిచ్చిన కడియం శ్రీహరి ఎన్నిసార్లు ఢిల్లీలో పోరాటం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీలో పోరాటం చేశామన్న మందకృష్ణ మరోసారి హస్తినలో దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అయితే తన దీక్షకు కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. 24ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నానన్న మందకృష్ణ ఎన్నో ఏళ్లుగా మంత్రిగా పనిచేస్తున్న కడియం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో కేసీఆర్కు తాము అండగా నిలిచామని ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో కేసీఆర్కు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తీసుకొస్తే జీవితాంతం టీఆర్ఎస్కు అండగా ఉంటామన్నారు.