ఎన్నికల నోటిఫికేషన్కు ముందే గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించారు. ప్రకటించిన అభ్యర్థులందరికి బీ-ఫామ్స్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. ఈనెల 11న తెలంగాణ భవన్లో స్వయాన ఆయన చేతులమీదుగానే అభ్యర్థులకు బీ-ఫారాలు అందించబోతున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే అభ్యర్థులంతా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా గెలుపు మనదే కావాలన్న దిశా-నిర్ధేశం చేయబోతున్నారు గులాబీ బాస్.
తెలంగాణలో ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్ మరో ముందడుగు వేశారు. పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులందరికి బీ-ఫామ్లు ఇవ్వబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ఒకరోజు ముందే బీ-ఫామ్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 11న తెలంగాణ భవన్లో అభ్యర్థులతో సమావేశమైన అనంతరం కేసీఆర్ సంతకం చేసిన బీ-ఫామ్లు అందజేయనున్నారు. దీంతో బీ-ఫామ్ల బెంగ పెట్టుకున్న అభ్యర్థులందరికీ టెన్షన్ తప్పింది.
గతనెల సెప్టెంబర్ 6న అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటివరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచార శైలిపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు కేసీఆర్. ఇక బీ-ఫామ్ ఇచ్చే ముందు తెలంగాణ భవన్లో అభ్యర్థులతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అభ్యర్థుల ప్రచారశైలి గెలుపు ఓటమిలపై అభ్యర్థుల నుంచే మరోసారి పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ సేకరించనున్నారు. ఇక ఇప్పటినుంచి ప్రచారం ఎలా ఉండాలి...ప్రభుత్వ లబ్ధిదారుల ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కి పడే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలనేదానిపై అధినేత కేసీఆర్ దిశా-నిర్దేశం చేయబోతున్నారు.
ఇక మరోవైపు పార్టీ ప్రకటించని 12నియోజకవర్గల అభ్యర్థులను ప్రకటించబోతున్నారు కేసీఆర్. మొత్తం 119నియోజకవర్గాల అభ్యర్థులకు 11నే బీ-ఫామ్లు అందనున్నాయి. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి కూడా గులాబీ జెండాను ఎగరవేసేందుకు స్వయాన కేసీఆర్ రంగంలోకి దిగారు. 11న ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 15వేల మంది కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించబోతున్నారు. తాను పార్టీ సారధిగా రాష్ట్రమంతా తిరగాల్సి ఉంటుంది కాబట్టి నియోజకవర్గంలో తన గెలుపు బాధ్యత మీదేనంటూ స్థానిక నేతలకు హితబోధ చేయనున్నారు గులాబీ బాస్.