తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది ముఖ్యమంత్రి కావాలనేది ఓ కల. మిగతా సమయంలో మౌనంగా ఉన్నప్పటికీ సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందనగానే సీఎం సీటుపై చర్చ ప్రారంభం కావడం కాంగ్రెస్ పార్టీలో మామూలే. ఎప్పుడూ పెద్దమనిషి తరహాలో గుంభనంగా వ్యవహరించే తెలంగాణ సీఎల్పీ లీడర్ జానారెడ్డి ఎట్టకేలకు తన మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్లో సీఎం పదవికి తనకంటే అర్హులెవరూ లేరని తేల్చి చెప్పారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ ఇప్పించింది కూడా తానేనని ప్రకటించారు.
కాంగ్రేస్ సీనియర్ నేత జానారెడ్డిది విలక్షణ శైలి. ఆయన వ్యవహారశైలి ఓ పట్టాన ఎరికీ అర్థం కాదు. ఆయన మనసులో ఏముందో అంత ఈజీగా బయట పెట్టరు. పార్టీ వ్యవహారాలపై ఎప్పుడూ బాహాటంగా చెప్పేందుకు ఇష్టపడని సీఎల్పీ నేత జానారెడ్డి మనసువిప్పి మాట్లాడారు. అనేక విషయాలపై తన ఆలోచనలను విడమరచి చెప్పారు. తన పెళ్లినాటి జ్ఞాపకాలు మొదలు తాజా రాజకీయాల వరకు అన్నిటిపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. పనిలో పనిగా సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీలో తనకంటే అర్హులెవరూ లేరనా.. తనను కాదంటే ప్రజలు కూడా అంగీకరించబోరని తెలంగాణ కాంగ్రెస్ ఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవికి సైతం సై అనే సంకేతాలిచ్చారు. గతంలో తనకు పీసీసీ ఇవ్వనపుడు పార్టీకి నష్టం జరగకూడదని తాను మౌనం వహించానని వివరించారు.
ఇక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో తన పాత్ర గురించి ఏనాడు చెప్పుకోని జానా.. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ ఇప్పించింది తానేనని తెలిపారు. ఈ విషయం ప్రజలకు తెలియడం కన్నా సంతోషం ఏముంటుందని అన్నారు. ఆర్నెల్ల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఉంటే కాంగ్రెస్కు ప్రయోజనం కలిగేదన్న అభిప్రాయంపై స్పందిస్తూ ఆనాటి పరిస్థితులు వేరని..25 మంది ఎంపీలు బయటికి వెళ్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. అలా జరిగితే తెలంగాణనే వచ్చిది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించి చివరిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిందని వివరించారు.
సీఎల్పీ సరిగా పరిగా పనిచేయడం లేదన్నమాటపై కెప్టెన్ ఎన్ని సెంచరీలు కొట్టినా అన్నిసార్లు మ్యాచ్ లు గెలువలేరు. లీడర్ టెన్ రన్స్ కొట్టినా టీం మెంబర్స్ ప్రదర్శన బాగుంటే మ్యాచ్లు గెలవొచ్చన్నారు. తమ స్పిరిట్ కూడా అదేనన్నారు. తమకు బలం లేదని తెలిసినా..సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారుల క్రాస్ ఓటింగ్ను సాక్ష్యంగా చూపించేందుకే రాజ్యసభ బరిలో నిలిచామని చెప్పారు. ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి ఎందరికో తానే రాజకీయ బాట వేసినట్లు చెప్పారు.