జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 11 మంది దుర్మరణం చెందారు. ఇవాళ ఉదయం లోరన్ నుంచి పూంఛ్ వెళ్తున్న ఓ బస్సు మండి ప్రాంతంలో రోడ్డుపై నుంచి జారిపడి పక్కనే ఉన్న లోతైన లోయలో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టతకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. మరికొందరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.