నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సి43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం 9.58 గంటలకు రాకెట్ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు. నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగిన కౌంట్డౌన్ ప్రక్రియ అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. కీలకమైన చివరి దశ పూర్తి కావడానికి మరో గంటకు పైగా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
పీఎస్ఎల్వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. యూఎస్కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.