చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా మామూలుగా కాదు దాడి చేసేందుకు అవకాశం ఇవ్వలేదు కోలుకునేందుకు క్షణం అయినా సమయం ఇవ్వకుండా బౌలింగ్, బ్యాటింగ్తో ఉతికారేసింది ఆసియా కప్లో దాయాదుల మధ్య జరిగిన పోరులో రోహిత్ గ్యాంగ్ గ్రాండ్ విక్షరీ కొట్టింది పాకిస్తాన్ ను చిత్తు చేసి.. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ అలవోకగా గెలిచింది. దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. రెండు వికెట్ల నష్టానికి భారత్ 164 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 52, శిఖర్ దావన్ 46, అంబటి రాయుడు 31, దినేశ్ కార్తిక్ 31 పరుగులు తీసి భారత్కు విజయాన్ని అలవోకగా అందించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇండియన్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కేవలం 43.1 ఓవర్లలో కేవలం 162 రన్స్ మాత్రమే చేసింది. పాక్ టీమ్లో అత్యధికంగా బాబర్ 47, మాలిక్ 43 రన్స్ చేశారు. భారత బౌలర్లు భువనేశ్వర్, కేదార్ జాదవ్లు విజృంభించడంతో పాక్ భారీ స్కోరు చేయలేక పోయింది ఈ ఇద్దరూ చెరి మూడేసి వికెట్లూ తీసి పాక్ నడ్డి విరిచారు
ఇక లక్ష్య ఛేదనలో భారత్కు శుభారంభం లభించింది. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్నా ఆ తర్వాత రోహిత్, ధావన్ బ్యాట్ ఝళిపించారు. గేరు మార్చి జోరు పెంచి 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే షాదాబ్ రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే ధావన్ కూడా వెనుదిరిగాడు. అయితే అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. కీలక వికెట్లు తీసి విజయానికి కారణమైన భువనేశ్వర్ కుమార్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక చిరకాల ప్రత్యర్థిని టీం ఇండియా చిత్తుగా ఓడించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.