ఫ్రగతి నివేదన సభకు వాన గండం...సభా ప్రాంగణంలో కూలిన భారీ కటౌట్‌

Update: 2018-09-02 04:28 GMT

అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు వరుణుడు ఆటంకం కల్గించాడు. కొంగరకలాన్‌లో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి వేదిక తడిచిముద్దయింది. ప్రాంగణంలో ఉన్న కటౌట్ కూలిపోయింది. ఇప్పటికే కొంగరకాలాన్‌ చేరుకున్న ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం..టీఆర్‌ఎస్‌ శ్రేణులు కలవరపడుతోంది.  

నిన్న రాత్రి కొంగర కలాన్‌లో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. దాదాపు గంట పాటు భారీ వర్షం పడింది. టీఆర్ఎస్  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ ప్రాంగణం మొత్తం తడిసి ముద్దయ్యింది. టెంట్లు, కార్పెట్లు మొత్తం తడిచిపోయాయి. భారీ వర్షానికితోడు ఈదురుగాలికి సభా ప్రాంగణంలో భారీ కటౌట్  కుప్పకూలింది. కటౌట్ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

కొంగర కలాన్‌లో పడిన భారీ వర్షంతో ప్రగతి నివేదన సభా ప్రాంగణంలోకి భారీగా నీరు చేరింది. నిన్న సాయంత్రానికే పలు జిల్లాల నుంచి కొంగరకలాన్ చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు పరుగులు తీశారు. చాలా మంది తడిచి ముద్దయ్యారు. సభ కోసం జరుగుతున్న పనులకు వర్షం ఆటంకం కలిగించింది. 

ఇవాళ మధ్యాహ్నం సభ జరగాల్సిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు , శ్రేణుల్ని వాతావరణం కలవరపెడుతోంది. నిన్న సాయంత్రం వరకు ఎండ బాగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వాన రావడాన్ని తలచుకుని ఇవాల్టి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. తెలంగాణలో అక్కడక్కడా వర్షం పడవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గూలాబీ దళం మరింత బెంబేలెత్తుతోంది.

Similar News