దూసుకొస్తున్న ‘గజ’ తమిళనాడులో హైఅలర్ట్

Update: 2018-11-14 13:38 GMT

గజ తుపాను తమిళనాడును హడలెత్తిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను చెన్నకి తూర్పున 530 కిలోమీటర్లు నాగపట్నానికి ఈశాన్యంగా 620 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలోనూ, 15న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కొన్నిచోట్ల మోస్తరుగానూ, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన గజ తుపాన్ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురువారం సాయంత్రానికి కడలూరు వద్ద తీరం దాటే అవకాశం వుంది. ఈ సమయంలో గంటకు 55 నుండి 60 కిలోమీటర్లు వేగంతో  గాలులు వీచే అవకాశం వుంది. ఒకవేళ గజ తుఫాన్ దిశ మార్చుకుని అరేబియాన్ సముద్రంలోకి ప్రవేశిస్తే మరో తుపాన్ కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. గజ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద అంతగాలేకపోయినా చెన్నైకు దగ్గరగా వున్న చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రా  యూనివర్సిటీ మెటరాలజీ డిపార్ట్ మెంట్ అంచనా వేస్తోంది.

గజ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, తంధ్యావూరు, తిరువారూరు, విల్లుపురం, రామనాథపురం, పుదుక్కొట్టయ్, చెన్నై జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకు వస్తుండడంతో అలర్టయ్యారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  దీంతో ముప్పు ముంచుకు వస్తోందని అంచనా వేస్తున్నఅధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు.తుపాను ప్రభావం అత్యధికంగా ఉండే తీరంలోని మండలాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు.  

Similar News