ప్రణయ్ కేసులో కొత్త పేరు...ఎవరీ అస్గర్ అలీ.. ప్రణయ్ హత్యతో అతనికి లింకేంటి?
సంచలనం సృష్టిస్తున్న మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్ బారీ అని భావిస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం బారీ గురువు అస్గర్ అలీనే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మారుతీరావును నుంచి కోటి సుపారీ తీసుకున్న అస్గర్ అలీ హత్యలో పాల్గొన్న వ్యక్తికి పది లక్షలు చెల్లించినట్లు తేలింది.
బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత స్వచ్ఛందంగా కశ్మీర్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్న నల్గొండకు చెందిన అస్గర్ అలీ, అతని శిష్యుడు అబ్దుల్ బారీ ఇండియన్ ముస్లిం మహ్మదీయ ముజాహిదీన్ సంస్థలో కీలక పాత్ర పోషించారు. వీరిపై నమోదైన గుజరాత్ మాజీ మంత్రి హరేన్పాండ్య హత్య కేసును కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత నుంచి వీరు నల్గొండలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న మారుతీరావును కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే మారుతీరావు వీరిద్దరితో పరిచయం పెంచుకున్నాడు. స్థిరాస్తి వ్యాపారంలో బెదిరింపులు మామూలే కావడంతో తన వ్యాపారానికి పనికొస్తారన్న ఉద్దేశంతోనే మారుతీరావు వీరితో స్నేహం కొనసాగించినట్లు తెలుస్తోంది.
ప్రణయ్ని అడ్డు తొలగించుకోవాలని భావించిన మారుతీరావు అస్గర్ అలీని సంప్రదించాడు. కోటి రూపాలను ఆశపెట్టడంతో, అలీ కూడా ఒప్పుకున్నాడు. తన సహచరుడు అబ్దుల్ బారీతో కలిసి ప్రణయ్ మర్డర్ కు ప్లాన్ చేశాడు. స్థానిక ముఠాతో పాటు తమకు పరిచయం ఉన్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను కూడా రంగంలోకి దింపాడు. హత్య చేసేది ఒకరైతే, సహకరించేందుకు మరికొందర్ని సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్లుగానే ఆసుపత్రి వద్ద ప్రణయ్ను హత్య చేసిన తర్వాత అంతా పరారయ్యారు. ఈ హత్య సంచలనం సృష్టించడంతో నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు నిందితులందర్నీ గుర్తించాయి.
ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ తో పాటు అస్గర్ అలీ, అబ్దుల్ బారీలను ఇక్కడే అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, చెన్నై, బిహార్లలో మరో నలుగుర్ని పట్టుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి వీరిని కూడా పట్టుకొని నల్గొండకు తీసుకొచ్చే అవకాశం ఉంది.