తెలంగాణలో అభివృద్ధి పనులకు కోడ్ బ్రేక్...కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్న మంత్రులు
తెలంగాణ అసెంబ్లీ రద్దయిన 20రోజుల తర్వాత ఎన్నికల కోడ్పై ఈసీ ఆలస్యంగా అలర్ట్ అయ్యింది. బీజేపీ నేతల ఫిర్యాదుతో మేల్కొన్న ఎన్నికల సంఘం అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందంటూ ప్రకటించింది. దాంతో తెలంగాణలో అభివృద్ధి పనులకు సడన్ బ్రేకులు పడ్డాయి. ఏది కోడ్లోకి వస్తుందో ఏది కోడ్లోకి రాదో తెలియక మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు.
సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కానీ అసెంబ్లీని రద్దుచేస్తే. ఆరోజు నుంచే కోడ్లో కొన్ని నిబంధనలు అమలు పర్చాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న ఈసీ తెలంగాణ అసెంబ్లీ రద్దయిన 20రోజుల తర్వాత ఎన్నికల నియమావళి అమలుపై స్పష్టతనిచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారాలను పరిశీలించి ఎన్నికల కోడ్ పార్ట్-7లో ఉన్న నిబంధనలు అమల్లో ఉన్నాయని సీఈవో రజత్కుమార్ ప్రకటించారు.
ఎన్నికల కోడ్పై ఈసీ అలర్ట్ కావడంతో కొన్ని అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. మంత్రులు ఒక్కసారిగా కోడ్-7పై ఆరా తీశారు. కోడ్-7లో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో తెలుసుకుని కొన్ని ప్రోగ్రామ్స్ను రద్దు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్-7 నిబంధనల ప్రకారం కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అధికారులే చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకూడదు. అలాగే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటించకూడదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.