షరతులతో రైతుబంధుకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌...రైతుల ఖాతాలకే డబ్బు

Update: 2018-10-06 05:30 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతు బంధు పథకంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పథకాన్ని గతంలోనే ప్రారంభించినందున ఎలాంటి అభ్యంతరం లేదన్న ఈసీ రెండో విడతకు పలు నిబంధనలు విధించింది. రైతు బంధు చెక్కులను నేరుగా రైతులకు ఇవ్వకుండా వారి  బ్యాంక్ అకౌంట్లలో జమా చేయాలని సూచించింది. 

పంట పెట్టుబడి ప్రోత్సాహకంగా తెలంగాణ సర్కారు పంపిణీ చేస్తున్న 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి అడ్డంకి తొలగింది. రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసిన లేఖకు సీఈసీ  స్పందించింది. రైతుబంధు అమలులో ఉన్న పథకమే కాబట్టి కోడ్ వర్తించదని తెలిపిన ఈసీ కొన్ని షరతులు విధించింది. 

రైతుబంధులో ఎకరాకు ఏటా రూ.8 వేలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం మొదటి విడతలో ఎకరాకు 4 వేల చొప్పున రైతులకు చెక్కులు పంపిణీ చేసింది. రెండో విడత చెక్కులను శుక్రవారం నుంచి రైతులకు అధికారులు  అంద‌జేస్తున్నారు. అయితే, మొదటి విడత మాదిరిగా రెండో విడతలో రైతులకు చెక్కులు ఇవ్వకుండా, వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను జమా చేయాలని ఈసీ సూచిందింది. కొత్త రైతులకు రైతు బంధు చెక్కులు జారీ చేయొద్దని ఆదేశించింది. రైతు బంధును రాజకీయ కార్యక్రమంలా నిర్వహించకూడదు అని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో రెవెన్యూశాఖ నిమగ్నమవడంతో  వ్యవసాయ అధికారుల ద్వారా రైతు బంధు పథకం నిర్వహించాలంటూ ఈసీ సూచించింది. 

Similar News