రోజుకో లీకుతో, ఏదేదో జరిగిపోతోందన్న ప్రచారంతో సస్పెన్స్ సినిమాను తలపించిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం కేసు కథ కంచికి చేరినట్లేనా..? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ సిట్ పూర్తిస్థాయి ఆధారాలను సేకరించలేక పోయిందని సిట్ చేసిన హడావుడి, గంటల తరబడి విచారణ అంతా ఉత్తదేనని తేలిపోయింది.
అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ 10 మంది సినీ ప్రముఖులను విచారించగా ముగ్గురి నుంచి మాత్రమే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారని శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని, ఈ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎక్సైజ్ సిట్కు నివేదిక అందిందని విశ్వసనీయ సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక అందిన నేపథ్యంలో ఈ నెల చివరి వారంలోగా చార్జిషీటు వేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది.
అయితే ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, ఆధారాలు ఎంతవరకు కోర్టులో నిలబడతాయన్న దానిపై ఎక్సైజ్ సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సినీ ప్రముఖులు దోషులేనని తేల్చదగిన కచ్చితమైన ఆధారాలేవీ అధికారులకు లభించలేదని తెలుస్తోంది. అరకొర ఆధారాలు కోర్టులో నిలవకపోతే కేసుతో ఇబ్బందిపడ్డ సినీ ప్రముఖులు పరువు నష్టం దావా వేసే అవకాశముందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి చార్జిషీటుతోనే కేసును తేల్చకుండా అనుబంధ చార్జిషీట్లు వేస్తూ కేసును పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం.