గూగుల్ సెర్చ్లో తెలుగులో 'కుట్ర' అని టైప్ చేస్తే మంత్రి కేటీఆర్ ఫొటోలు వస్తున్నాయని, కుట్రకు పర్యాయపదంగా కేటీఆర్ నిలిచారని టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ విమర్శించారు. మోదీతో టీఆర్ఎస్ పార్టీ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుందని, అందుకే పార్లమెంట్లో మోదీ కాంగ్రెస్ విమర్శించగానే.. రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చిట్చాట్ పేరుతో కాంగ్రెస్ పై అవాకులు, చవాకులు మాట్లాడారని దుయ్యబట్టారు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన ఆ వార్తల క్లిప్పింగ్లను మోదీకి చేరవేసేందుకు ట్విటర్లో పోస్టు చేసి రాజకీయ కుట్రకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకుంటే.. మీరేమో ఇంటిల్లిపాదీ పదవులు అనుభవిస్తున్నారని కేసీఆర్ కుటుంబాన్నిఉద్దేశించి లేఖలో వ్యాఖ్యానించారు. మీ కుటుంబానికి రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. మోదీ తెలంగాణ బిల్లుపై విచ్చలవిడిగా మాట్లాడుతుంటే విమర్శించాల్సింది పోయి మెప్పుకోలు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.
‘‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లోఫరా? రాష్ట్రాన్ని దోచుకున్న మీరు లోఫర్లా?.. గన్పార్కు వద్ద చర్చలో తేల్చుకుందాం’’ అని దాసోజు సవాల్ విసిరారు. కేటీఆర్ తీరును తప్పుబడుతూ ఆయనకు ఆదివారం రాసిన బహిరంగ లేఖ వివరాలను గాంధీభవన్లో మీడియాకు వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్, సహారా సీబీఐ కేసులకు భయపడే మోదీతో టీఆర్ఎస్ లాలూచీ పడుతోందన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రధాని మోదీ కించపరుస్తుంటే నోరు మూసుకొని విన్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు.