తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గద్వాల్లో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం బంగారు తెలంగాణ కోసం నీళ్లు, నియామకాలు, నిధులు వస్తాయని ప్రజలు కలకన్నారని కాని బంగారు కుటుంబం మాత్రమే వచ్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లగా ప్రజల కలలు కల్లలయ్యాయి అని విమర్శించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్లను దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే కావో కమీషన్ రావ్’’ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో అమరవీరులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు. అలాంటి గొప్ప త్యాగమూర్తులకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకుంటే నిరుద్యోగులను నిండాముంచరని విరుచుకపడ్డారు.