ప్రచార రథం ఎక్కేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. మైకులు పట్టుకుని ప్రజల ముందుకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లూ మహాకూటమి ఏర్పాటులో బిజీగా గడిపిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రచారశంఖం పూరించనున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రచారయాత్రను ప్రారంభించనున్నారు.
హండ్రెడ్ మైల్స్ స్పీడ్తో దూసుకుపోతున్న కారుకు బ్రేకులేసి విజయతీరాలను అందుకునేందుకు హస్తం నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న కాంగ్రెస్ పెద్దలు.. ఇవాళ్టి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యానికి అమ్మవారి ఆశిస్సులు కూడా జతచేసేందుకు రాష్ట్రంలోని ఏకైన శక్తి క్షేత్రం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రచారయాత్రను ప్రారంభించనున్నారు.
ఇవాళ కాంగ్రెస్ పెద్దలైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో సహా వివిధ కమిటీలకు చెందిన ఛైర్మెన్లు ప్రత్యేక హెలికాప్టర్లలో హైదరాబాద్ నుంచి ఆలంపూర్కు చేరుకుంటారు. తర్వాత అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు గద్వాల రాజీవ్ చౌరస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. మరోవైపు ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో.. ఒకే బృందంతో ప్రచారం చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. దీంతో ప్రచారానికి 3 బృందాలు.. 3 హెలికాప్టర్లలో పర్యటించాలని నిర్ణయించారు.