రాజస్థాన్లో చోటుచేసుకున్న అత్యంత భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. 'లవ్ జిహాద్' పేరిట ఓ వ్యక్తిని సజీవ దహనం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడో కిరాతకుడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. ఈ ఉదంతాన్నంతా చిత్రీకరించి.. లవ్ జిహాద్కు పాల్పడినవాళ్లందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించడం గమనార్హం. శంభులాల్ అనే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఇప్పటికే అతని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అఫ్రజుల్ అనే ఆ బాధితుడిని తానే అక్కడికి పిలిచి.. గొడ్డలితో దాడి చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఈ హత్యలో ఏదైనా మతపరమైన కోణం ఉందేమో అన్న ఉద్దేశంతో రాజస్థాన్ ప్రభుత్వం ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నది. ఇంత దారుణంగా అతన్ని గొడ్డలితో నరికి, సజీవంగా దహనం చేసి వీడియో తీయడం షాక్కు గురి చేసిందని ఆ రాష్ట్ర హోంమంత్రి గులాబ్చంద్ కటారియా అన్నారు. మృతుడిని మొహమ్మద్ అఫ్రజుల్గా గుర్తించారు. అతడు వెస్ట్ బెంగాల్లోని మాల్దా నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకుంటున్నాడు. ఈ ఘటనను వీడియో తీసింది నిందితుడి స్నేహితుడే. ఈ ఘటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజ్సమంద్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.