సర్వేల కాలంలో.. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే కొన్ని పార్టీలు సర్వేలు చేయించగా తాజాగా తెలంగాణలో ఏఐసీసీ నిర్వహించిన సర్వేల్లో.. షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఏకంగా 35 స్థానాల్లో సునాయాస విజయం సొంతమవుతుందని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. కాంగ్రెస్, టీడీపీ కూటమి 35 సీట్ల కైవసం చేసుకుందంటూ.. ఏఐసీసీ నిర్వహించిన సర్వేలో వెల్లడవడం.. మహాకూటమి నేతలను సంతోషంలో ముంచెత్తుతోంది. రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, గెలుపు అవకాశాలపై ఏఐసీసీ పలు సర్వేలు చేయించింది. ఈ సర్వేల్లో ఆ పార్టీ నాయకులను షాక్కు గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్తో పాటు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై నిర్వహించిన అంతర్గత సర్వేలో 35 నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరుమీద నడకే అని తేలినట్లు తెలుస్తోంది.
ఈ 35 స్థానాల్లో.. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా.. విజయం తథ్యం అని.. సర్వేలో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ స్థానాల్లో టీడీపీ బలంగా ఉన్నవే అని.. క్యాడర్ నుంచి సపోర్ట్ బాగుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. పలు నియోజకవర్గాల్లో.. టీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్వేలకు సంబంధించి కీలకమైన సమాచారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దగ్గర ఉన్నట్లు చెబుతున్నాయి. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను పార్టీ నాయకులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి అందజేశారు. దీంతో తాజా పరిస్థితిపై చర్చించేందుకే ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే 35 సీట్లలో గెలుపు ఖాయం కాబట్టి మేజిక్ ఫిగర్కు కావాల్సిన పాతిక సీట్లపై దృష్టి సారిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ సర్వే ప్రకారం టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు.. దేవరకద్ర, మక్తల్, వనపర్తి, జడ్చర్ల, షాద్నగర్, పటాన్చెరు, జహీరాబాద్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, సిర్పూర్, ఖానాపూర్, జగిత్యాల, పెద్దపల్లి, నర్సంపేట్, ములుగు, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మిర్యాలగూడ, హుజూర్నగర్, తుంగతుర్తి, ఆలేరు, ఉప్పల్, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సనత్నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీంతో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ ఆయా స్థానాలనే కేటాయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.