పెళ్లింట విషాదం నెలకొంది.. ఎన్నో ఆశలతో నూతన జీవితం ప్రారంభించాలనుకున్న ఆ యువతి ముచ్చట తీరనేలేదు..కాళ్ళ పారాణైన ఆరకుండానే జీవితభాగస్వామి వడిలోనే కన్నుమూసింది. భర్త కాళ్లకు మొక్కుతూ పెళ్లిపీటలపైనే ప్రాణాలు వదిలింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. మహేంద్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మికి.. రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన వెంకటేష్తో శనివారం వివాహం జరిగింది. వధువు మెడలో వెంకటేష్ తాళికట్టిన తర్వాత, తలంబ్రాల తంతు సందడిగా సాగింది. ఈ తంతు ముగిసిన తర్వాత వెంకటేష్ కాళ్లకు మొక్కే సమయంలో లక్ష్మి ఒక్కసారిగా అతని కాళ్లపైనే కుప్పకూలిపోయింది. మొదట బంధువులంతా లక్ష్మీ స్పృహ కోల్పోయిందనుకున్నారు. ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఊహించని ఘటనతో అంతా విషాదంలో మునిగిపోయారు.