కర్ణాటకలో అధికారం సాధించుకున్న బీజేపీ..ఇక తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలయిన తర్వాతి రోజే ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష పదవితోపాటు..ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ను కూడ నియమించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్లను నియమిస్తుండడంతో తెలంగాణలో కూడ అదే పదవిని భర్తీ చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ పదవి కోసం ఇప్పటికే కొందరు సీనియర్లు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ పదవి దాదాపు అధ్యక్ష పదవితో సమానం. ఎన్నికల సమయంలో అధ్యక్షుని కంటే ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనరే కీలకంగా ఉంటారు. టిక్కెట్ల కేటాయింపు అంతా అధ్యక్షుడు, ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ చూస్తారు. దీంతో ఈ పదవి దక్కించుకోవాలని చాలా మంది పైరవీలు చేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ... బీసీ సమాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ ఉండడంతో..రెడ్డి సామాజిక వర్గానికి కన్వీనర్ పదవి ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో కిషన్ రెడ్డి పేరు ప్రధమంగా వినిపిస్తోంది. అయితే కిషన్ రెడ్డి శాషన సభాపక్ష నేతగా భాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆయనకు ఇస్తారా లేదో అనే అనుమానం నెలకొంది. ఒకవేళ బీసీలకు ఇచ్చేటట్లయితే... కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్సీ రాంచంధర్ రావు, పేరాల చంద్రశేఖర్ కూడ ఈ పదవికోసం తెగ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ఇప్పటికే గ్రూపులతో సతమతమవుతోందనే ఆరోపణలున్నాయి ఇప్పుడు అధ్యక్ష పదవికి సమాంతరంగా మరో కొత్త పోస్టు ఇస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.