హైదరాబాద్ ను తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించడంపై టీడీపీ అధినేత ఈ రోజు స్పందించారు. హైదరాబాదును, చార్మినార్ ను కట్టినట్లు తాను ఎన్నడూ ప్రచారం చేసుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తాను సైబరాబాద్ ను మాత్రమే నిర్మించాననీ, హైదరాబాద్ కు పేరు తీసుకొచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎవరూ ఊహించని అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. శేరిలింగంపల్లిలో రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో ఊహించని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి తమ కష్టార్జితమన్నారు. ఐటీ అభివృద్ధితో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న స్టేడియాలన్నీ గతంలో నిర్మించినవే చంద్రబాబు పేర్కొన్నారు. తమ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్కు కృష్ణా నీళ్లు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానని కేసీఆర్, కేటీఆర్ పొగిడారని, ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.