చందమామ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకవైపు మనదేశం చంద్రయాన్-2 పేరుతో చంద్రునిపై రోవర్ ను దించే పనిలో ఉంటే.. మరోవైపు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఏకంగా అక్కడ 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది.
చంద్రుడిపై తొలిసారిగా 4జీ నెట్వర్క్ ఏర్పాటుకానుంది. వొడాఫోన్ - నోకియా భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ బృహత్ కార్యంలో ఆడి సంస్థ కూడా చేయి కలుపుతోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అద్భుతాలే సృష్టించవచ్చంటున్నారు అంతరిక్ష నిపుణులు.
2019లో బెర్లిన్ కు చెందిన ప్రముఖ స్పేస్ ప్రయోగ సంస్థ పీటీ సైంటిస్ట్స్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా చేపట్టనున్న మిషన్కు సపోర్ట్గా చంద్రుడిపై తొలి 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వొడాఫోన్ జర్మనీ తెలిపింది. ఈ ప్రయోగంలో ‘నోకియా’ టెక్నాలజీ పార్టనర్గా పనిచేస్తుంది. ప్రైవేట్ ఫండింగ్ తో తలపెడుతున్న తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ ఇది. అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తును నిర్దేశించే ఈ ప్రయోగంతో రోవర్లు సేకరించిన సైంటఫిక్ డేటాను భూమికి అందించే ప్రక్రియకు సాయమందుతుంది.
పీటీ సైంటిస్ట్స్ పరిశోధన వివరాలను ఎప్పటికప్పుడు స్పష్టమైన చిత్రాలతో అందించేందుకు ఈ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నామని పీటీ సైంటిస్ట్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రాబర్ట్ బోమ్ చెప్పారు. వొడాఫోన్ చంద్రుడిపై ఏర్పాటు చేసే నెట్వర్క్ 1800MHz ఫ్రీక్వెన్సీ కలిగిన 4G సేవలు అందిస్తుంది. ఈ 4G నెట్వర్క్ను చంద్రుడి మీద వినియోగించే రెండు ఆడీ లూనార్ క్వట్ట్రో రోవర్లకు అనుసంధానిస్తారు.
ఈ నెట్వర్క్ ఏర్పాటుతో చంద్రుడిపై చిత్రించే HD వీడియోలు బెర్లిన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్కు అందుతాయి. అలాగే చంద్రుడి నుంచి నేరుగా ప్రపంచానికి హచ్. డి. లైవ్ స్ట్రీమింగ్ ను అందించడం సాధ్యమవుతుంది. ఈ కల సాకారమైతే విశ్వం ఆవిర్భావంపై జరుగుతున్న పరిశోధనల్లో మరో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నారు. అంతే కాదు చంద్రునిపై నివాసానికి ప్రయోగాలు మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.