దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం కేసులో.... పాటియాలా సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు ఏ రాజాతో సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న పాటియాలా సీబీఐ కోర్టు.... ఏకవాక్య తీర్పు వెలువరించింది. అయితే తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, యూపీఏ కూటమి దారుణ ఓటమికి కారణమైన 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో పాటియాలా సీబీఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు.... ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు.... ఏకవాక్య తీర్పు వెలువరించింది. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.
యూపీఏ హయాంలో వెలుగుచూసిన 2జీ స్కామ్ తీవ్ర సంచలనం సృష్టించింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి లక్షా 76వేల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ ఆరోపించడంతో.... ఆనాడు టెలికాం మంత్రిగా ఉన్న ఏ రాజాను పదవి నుంచి యూపీఏ తప్పించింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీ... రాజా, కనిమొళి సహా 17మంది నేతలు, కార్పొరేట్ కంపెనీల అధికారులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2011లో అరెస్టయిన రాజా.... ఏడాదిపాటు జైల్లో ఉన్నాడు. సుమారు ఆరేళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసులో నిందితులందరినీ పాటియాలా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు వినగానే కనిమొళి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుటుంబానికి, డీఎంకేకి బిగ్ డే అన్నారు. చారిత్రాత్మక తీర్పుగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభివర్ణించారు. చివరికి న్యాయమే గెలిచిందన్నారు.
తీర్పుపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తోపాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు స్పదించారు. యూపీఏ సర్కార్పై అవినీతి ఆరోపణలు చేసిన వారందరికీ ఈ తీర్పు చెంప పెట్టన్నారు.
2జీ స్కామ్లో తీర్పును చూసి సంతోషపడొద్దంటూ కాంగ్రెస్ నేతలకు కేంద్ర ఆర్ధికమంత్రి జైట్లీ సూచించారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్ని రద్దు చేసినప్పుడే యూపీఏ పనితీరేంటో రుజువైందన్నారు. అయితే పాటియాలా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ తెలిపింది. తీర్పును అధ్యయనంచేసి తుది నిర్ణయం తీసుకుంటామని సీబీఐ ప్రకటించింది.