Travel Insurance: ప్రయాణ సమయంలో బీమా తప్పనిసరి.. ప్రయోజనాలు తెలుసుకోండి..!
Travel Insurance: ప్రయాణ సమయంలో బీమా తప్పనిసరి.. ప్రయోజనాలు తెలుసుకోండి..!
Travel Insurance: మీరు ప్రయాణం చేసే సమయంలో కచ్చితంగా ప్రయాణ బీమాను తీసుకోవాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ విమాన టిక్కెట్లపై అలాగే రైలు టిక్కెట్లు, బస్సు టిక్కెట్లపై ఉంటుంది. ఈ బీమాతో మీరు పోగొట్టుకున్న వస్తువులు, దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైతే చికిత్సకు అయ్యే ఖర్చు, దురదృష్టవశాత్తూ, మరణించిన సందర్భంలో ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందుతుంది.
మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఆన్లైన్ రైలు టిక్కెట్ను బుక్ చేసుకునే సమయంలో బీమా అందుబాటులో ఉంటుంది . కానీ రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపికను ఎంచుకునే వ్యక్తులు చాలా తక్కువ. కారణం వారికి తెలియకపోవడమే. కేవలం ఒక్క రూపాయికి ప్రయాణీకుడు రూ. 10 లక్షల వరకు కవరేజీని పొందుతాడు. మీరు మీ టిక్కెట్ను బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేస్తే రైలు ప్రమాదం వల్ల ప్రయాణీకుడికి ఎలాంటి నష్టం జరిగినా బీమా కంపెనీ పరిహారం ఇస్తుంది.
ప్రయాణ బీమా పొందండి
మీరు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసినప్పుడు వెబ్సైట్, యాప్లో ప్రయాణ బీమా ఎంపిక ఉంటుంది. తరచుగా ప్రజలు ఈ ఎంపికకు శ్రద్ధ చూపరు. కానీ టిక్కెట్ను బుక్ చేసుకునేటప్పుడు బీమా ఎంపికను ఎంచుకోవాలి. మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ IDకి లింక్ వస్తుంది. ఈ లింక్ని ఓపెన్ చేసి అక్కడ నామినీ వివరాలను నింపాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ ఉంటేనే బీమా క్లెయిమ్ పొందడం సులభమవుతుంది.
క్లెయిమ్ మొత్తం ఎంత..?
రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగితే ప్రయాణీకుల నష్టాన్ని బీమా కంపెనీ భర్తీ చేస్తుంది. ప్రయాణికుడు మరణిస్తే బీమా మొత్తం రూ.10 లక్షలు అందుతుంది. రైల్వే ప్రయాణికుడు పూర్తిగా అంగవైకల్యం చెందినా, బీమా కంపెనీ అతనికి రూ.10 లక్షలు ఇస్తుంది. అదే సమయంలో పాక్షిక శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయం అయితే రూ.2 లక్షలు ఆసుపత్రి ఖర్చులుగా అందుబాటులో ఉంటాయి.
నామినీ లేకుంటే కష్టం
రైలు ప్రమాదం జరిగితే గాయపడిన వ్యక్తి, నామినీ లేదా అతని వారసుడు బీమాను క్లెయిమ్ చేయవచ్చు. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల్లోపు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లడం ద్వారా బీమా కోసం దావా వేయవచ్చు.