Petrol, Diesel Price Today: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol, Diesel Price Today: లీటరు పెట్రోల్ పై రూ.10.51, డీజిల్పై రూ.9.15 పెంపు
Representational image
Petrol, Diesel Price Today: దేశంలో చమురు ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మే 4 నాలుగు నుంచి ఇప్పటి వరకు 38 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం మరోసారి లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 26 పైసలను చమురు సంస్థలు పెంచాయి. గత 68 రోజుల్లో లీటరు పెట్రోల్ ధర 10.51, డీజిల్ 9.15 రూపాయలు పెరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇంధనాల ధరలు మరింత భగ్గుమన్నట్టయింది. పెట్రో వాతలతో వాహనదారులు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు.. పెరుగుతున్న ఇంధనాల ధరలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. కానీ, ఇవేమి పట్టించుకోకుండా చమురు కంపెనీలు ధరలు పెంచుతూనే ఉన్నాయి.
ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధరల వంద మార్కును దాటింది. అదే దారిలో డీజిల్ ధర కూడా పెరుగుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో డీజిల్ ధరల వంద మార్కును దాటింది. వ్యాట్, ప్రైట్ చార్జీలను బట్టి ఇంధనాల ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. ఢిల్లీలో 55శాతం పన్నులుగా ఉన్నాయి. మరోవైపు.. దేశీయంగా మే నెలలో తొమ్మిది నెలల కనిష్టస్థాయికి క్షీణించిన ఇంధనాల డిమాండ్ జూన్ నెలలో పుంజుకుంది. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన ఆంక్షల సడలింపులు ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకోవడానికి, వాహనాల వినియోగం పెరగడానికి కారణం అయ్యాయి. జూన్ నెలలో ఇంధనాల వినియోగం.. గతేడాది ఇదే నెలతో పోల్చితే 1.5శాతం పెరిగి 16.33 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఈ ఏడాది మే నెలతో పోల్చితే వృద్ధి 8శాతం ఉందని పేర్కొంది.