Bharat Bandh : నేడు భారత్ బంద్..దేశవ్యాప్తంగా రోడ్డు మీదకు 30 కోట్ల మంది
నేడు భారత్ బంద్..దేశవ్యాప్తంగా రోడ్డు మీదకు 30 కోట్ల మంది
Bharat Bandh : ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా బ్యాంక్ ఖాతాదారుల్లో ఒకటే టెన్షన్.. అదేంటంటే ఈరోజు బ్యాంకులు అసలు పనిచేస్తాయా? లేదా? అన్నదే. సుమారు 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉండటంతో బ్యాంకింగ్ సేవలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సమ్మెకు కారణం ఏంటి?
కేంద్ర ప్రభుత్వం 2025లో తీసుకువచ్చిన నాలుగు కొత్త కార్మిక చట్టాలను నిరసిస్తూ దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వంటి పెద్ద బ్యాంక్ యూనియన్లు కూడా మద్దతు ప్రకటించాయి. వారానికి 5 రోజుల పని దినాలు, మెరుగైన పని వాతావరణం వంటి తమ పాత డిమాండ్లను కూడా ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు తెరపైకి తెచ్చారు.
బ్యాంకులు తెరిచి ఉంటాయా?
నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, ప్రభుత్వం గానీ ఈరోజు అధికారిక సెలవు ప్రకటించలేదు. అంటే టెక్నికల్గా బ్యాంకులు తెరిచే ఉంటాయి. అయితే, సిబ్బంది పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నందున చాలా శాఖల్లో కౌంటర్ సేవలు నిలిచిపోవచ్చు. చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు లేదా విత్డ్రాయల్స్ వంటి పనులకు ఆటంకం కలగవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రధాన బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులను హెచ్చరించాయి.. సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో జాప్యం జరగొచ్చని ముందే క్లారిటీ ఇచ్చాయి.
ఏటీఎంలు, ఆన్లైన్ సేవలు ఉంటాయా?
ఖాతాదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి. ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు, కానీ సమ్మె వల్ల ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియకు జాప్యం కలిగితే, కొన్ని చోట్ల డబ్బులు అయిపోవచ్చు. కాబట్టి ఏదైనా అత్యవసర నగదు అవసరం ఉంటే ముందే జాగ్రత్త పడటం మంచిది.
కస్టమర్లు ఏం చేయాలి?
ఒకవేళ మీరు ఈరోజు బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి పనులు చేసుకోవాలని అనుకుంటే, ముందుగా మీ స్థానిక బ్యాంక్ అధికారితో మాట్లాడటం లేదా ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకోవడం ఉత్తమం. అత్యవసర పనులు లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేసుకోవడం మంచిది. అయితే చాలా చోట్ల బ్యాంక్ అధికారులు సేవలు కొనసాగించడానికి ప్రయత్నిస్తారని, కేవలం యూనియన్ సభ్యులు మాత్రమే నిరసనలో పాల్గొంటారని సమాచారం.