Gas Cylinder Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Gas Cylinder Price Hike : దేశంలో వంట గ్యాస్ ధర రూ. 60, కమర్షియల్ గ్యాస్ ధర రూ. 115 పెరిగింది. అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం రిఫైనరీలను ఆదేశించింది.
Gas Cylinder Price Hike : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ వంటింట్లో మంటలు రేపుతున్నాయి. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం నేరుగా సామాన్యుడిపై పడింది. అటు అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఇటు దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచుతూ అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది.
గ్యాస్ ధరల మంట.. సామాన్యుడికి బెంబేలు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధరల ప్రకారం.. గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.60 పెరిగింది. అటు వ్యాపార వర్గాలపై కూడా భారం పడింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో హైదరాబాద్లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.905 నుంచి రూ.965కి చేరగా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1961 నుంచి ఏకంగా రూ. 2076కి పెరిగింది. యుద్ధ భయం, గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడమే ఈ పెంపునకు ప్రధాన కారణాలని తెలుస్తోంది.
ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశం
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో, భవిష్యత్తులో గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలోని చమురు రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. ఉత్పత్తి చేసిన గ్యాస్ను మొట్టమొదట దేశీయ అవసరాలకే మళ్లించాలని, ఆ తర్వాతే ఇతర వాణిజ్య అవసరాలను చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన కీలక ఆదేశాలు:
త్రీ-కంపెనీ రూల్: రిఫైనరీలు ఉత్పత్తి చేసే ఎల్పీజీని కేవలం మూడు ప్రభుత్వ చమురు సంస్థలకు (IOC, BPCL, HPCL) మాత్రమే విక్రయించాలని సూచించింది.
పెట్రోకెమికల్ నియంత్రణ: ఎల్పీజీ తయారీలో వాడే ప్రొపేన్, బ్యూటేన్ వాయువులను పెట్రోకెమికల్ పరిశ్రమలకు మళ్లించకూడదని, వాటిని కేవలం వంట గ్యాస్ తయారీకే వాడాలని ఆదేశించింది.
అదనపు నిల్వలు: అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గంలో ఆటంకాలు కలిగితే ఇబ్బంది రాకుండా, ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నిల్వలు పుష్కలం.. ఆందోళన వద్దు
ఒకవైపు ధరలు పెరిగినప్పటికీ, దేశంలో ప్రస్తుతం గ్యాస్, చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా పెరిగాయని (ఫిబ్రవరిలో 20 శాతానికి చేరింది), దీనివల్ల సరఫరాలో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎంఆర్పీఎల్ రిఫైనరీ మూతపడిందన్న వార్తలు అబద్ధమని, అక్కడ ఉత్పత్తి యధావిధిగా సాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎనర్జీ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు సహజమని, అయితే ప్రజలకు వంట గ్యాస్ అందకుండా పోయే పరిస్థితి మాత్రం రాదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.