యాపిల్ ఫోన్.. ఈ మాట వింటేనే సెల్ ఫోన్ ప్రేమికులు ఉర్రూతలూగిపోతారు. ఐ ఫోన్ తమ దగ్గర ఉంటె బాగుంటుందని కోరుకొని వారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈ యాపిల్ ఐ ఫోన్ ధరలు మాత్రం అందుబాటులో ఉండే ప్రసక్తే లేదు. అంత ఖరీదు పెట్టి ఐఫోన్ కొనలేక.. దిగులు చెందేవారు కోకోల్లరు. ఇప్పటి వరకూ ఐఫోన్ కొనుక్కుందామనుకున్నా దాని ధరకు భయపడి ఆండ్రాయిడ్ ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు చాలామంది. అసలు ఐఫోన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అదేవిధంగా భారత దేశంలోనూ ఐఫోన్ ఆంటే పది చచ్చిపోయేవారికి కొదవేలేదు. ఇప్పుడు ఐ ఫోన్ ను బడ్జెట్ ధరలో తీసుకువచ్చేందుకు యాపిల్ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ మార్చిలోనే..
సెల్ ఫోన్ వినియోగదారుల్లో బడ్జెట్ ఫోన్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా భారతీయ వినియోగదారుల డిమాండ్ కోణంలో మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు యాపిల్ కంపెనీ రంగంలోకి దిగింది. అతి త్వరలో తక్కువ ధరలో ఐఫోన్ను విడుదల చేయబోతోంది. అతి త్వరలో అంటే రెండు నెలల్లోనే.. సుమారుగా ఈ ఏడాది మార్చి నాటికల్లా ఈ బడ్జెట్ ఐఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. 2020లో 200 మిలియన్ల హ్యాండ్సెట్లకు పైగా రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యాపిల్ ఆ దిశలో ఈ బడ్జెట్ ఫోన్ ను ప్రమోట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగా ఈ ఫిబ్రవరి నుంచే ఈ బడ్జెట్ ఐ ఫోన్ అసెంబ్లింగ్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ అసెంబ్లింగ్ను హాన్హయ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ, పెగట్రాన్ కార్పొరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్లకు యాపిల్ అప్పగించింది. 'ఐఫోన్ ఎస్ఈ' తరువాత అతి తక్కువ ధరలో వెలువడనున్న హ్యాండ్సెట్ ఇదే కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫీచర్లు ఎలా ఉంటాయంటే..
బడ్జెట్ లో యాపిల్ తీసుకువస్తున్న ఐఫోన్ ఫీచర్లు సుమారుగా 2017 లో కంపెనీ అందుబాటులోకి తెచ్చిన ఐఫోన్ 8 కు దగ్గరలో ఉండొచ్చని అంటున్నారు. అదేవిధంగా ఈ ఐఫోన్ 4.7 అంగుళాల డిస్ప్లే స్క్రీన్తో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న విధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ కు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ ధర గురించి మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. యాపిల్ కంపెనీ అధికారికంగా ఈ బడ్జెట్ ఫోన్ కు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కంపెనీ అధికారులు కూడా ఈ వివరాలను చెప్పడానికి నిరాకరిస్తున్నారు.
వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యం..
వినియోగదారులను పెంచుకోవడమే లక్ష్యంగా 2020 లో దూకుడుగా వెళ్ళడానికి యాపిల్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బడ్జెట్ ఫోన్ తోపాటు వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు ఈ సంవత్సరంలో సరికొత్త ఫీచర్లు, మరింత వేగవంతమైన ప్రాసెసర్, 3డి బ్యాక్ కెమెరా, 5జీ కనెక్టివిటీ.. తదితర ఫీచర్లతో కూడిన హైఎండ్ ఐఫోన్లను విడుదల చేయాలని భావిస్తోంది.