కుప్పం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కన్నుమూత
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, డాక్టర్ కె.చంద్రమౌళి మరణించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, డాక్టర్ కె.చంద్రమౌళి మరణించారు. కుప్పం మండలం పెద్దబంగారునత్తం చంద్రమౌళి స్వగ్రామం. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య పద్మజ, కుమారులు భరత్, శరత్ ఉన్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్కు చెందిన చంద్రమౌళి విజయనగరం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టరుగా, కడప జిల్లా కలెక్టర్గా పని చేశారు. రెండు సార్లు వైసీపీ తరుపున కుప్పం నుంచి పోటీచేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపైనే రెండుసార్లు ఓటమిచెందారు.
2019 శాసనసభ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లనప్పుడు కూడా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎన్నికల అనంతరం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గడిచిన ఎన్నికల్లో కుప్పం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం కుప్పం పార్టీ బాధ్యతల్ని ఆయన కుమారుడు భరత్ చూస్తున్నారు. చంద్రమౌళి భౌతికకాయాన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు.