తిరుచానూరులో పంచమితీర్థ మహోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ పద్మావతీ అమ్మవారికి బంగారు ఆభరణం సమర్పించారు. రూ.7 లక్షలు విలువైన 113 గ్రాములు బరువు ఉన్న అన్కట్ డైమండ్ నెక్లెస్ను సీఎం తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయ అధికారులకు అందజేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. పంచమి తీర్థం మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విశేషమైన పంచమి తీర్థం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించినట్టు చెప్పారు. కాగా ఆదివారం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించారు. ఆ తరువాత రాత్రి 9.30 నుంచి 10.30 వరకు ధ్వజావరోహణం నిర్వహించారు.