AP DSC: ఏపీలో డీఎస్సీ నిర్వహిస్తారా? వాయిదానా?.. అభ్యర్థుల్లో ఆందోళన
AP DSC: పరీక్షా కేంద్రాలకు ఎంపికకు ఇవ్వని అవకాశం
AP DSC: ఏపీ డీఎస్సీని షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు.
తద్వారా హాల్టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదముంది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనేదానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. డీఎస్సీ నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. కావాలనే పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం.