ఏపీలో కరోనాతో మరణం మార్చి 30న .. ప్రకటన ఏప్రిల్ 3న.. ఆలస్యం వెనుక..
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వల్ల తొలి మరణం సంభవించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే విజయవాడకు చెందిన వ్యక్తి కరోనా సోకి చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వల్ల తొలి మరణం సంభవించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే విజయవాడకు చెందిన వ్యక్తి కరోనా సోకి చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.అయితే, మార్చి 30న కరోనా వైరస్ వల్ల బాధితుడు ప్రాణాలు కోల్పోతే...ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా బాధితుడు విజయవాడ జనరల్ ఆస్పత్రికి మార్చి 30న ఉదయం 11.30 గంటలకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. అయితే, చనిపోయిన వ్యక్తి కుమారుడు ఢిల్లీ నుంచి వచ్చారని వైద్యులు నిర్ధారించారు. కుమారుడి ద్వారా కరోనా సోకి ఉంటుందని భావించారు.
అలాగే, కాంటాక్ట్లో ఉన్న 29 మందిని క్వారంటైన్ తరలించారు. అయితే, తండ్రీకొడుకుల కరోనా రిపోర్టులు మార్చి 31నే వచ్చాయి. అందులో వారిద్దరికీ కరోనా ఉన్నట్టు నివేదికలో తేలింది. కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయినా ప్రభుత్వం మాత్రం దాన్ని కరోనా మరణంగా గురువారం వరకు నిర్ధారించలేదు. 'సుబానీ ఇతర ఆనారోగ్య సమస్యలతో ఉండడం వల్ల వైరస్ వల్ల చనిపోయారా లేక ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారా? అని తెలుసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. చివరకు ఆయన కరోనా వైరస్ వల్ల చనిపోయారని నిర్ధారించడం జరిగింది.' అని రాష్ట్ర ప్రభుత్వవైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కేవలం 'కొంత జాప్యం' అని చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
తెలంగాణలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్కు చెందిన ఓ వృద్ధుడు చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ అని రిపోర్టులో వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన జారీ చేశారు. ఏపీలో అలాంటి కేసు విషయంలో ప్రకటన ఆలస్యంగా రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈనెల 2న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కరోనా కేసుల విషయం లో వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదని చంద్రబాబు అన్నారు. నిజాలను వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేయాలని లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే.