Dronamraju Srinivasa Rao Passed Away : వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి

Update: 2020-10-04 13:21 GMT

Dronamraju Srinivasa Rao Passed Away : మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు (59) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారినపడడంతో ఆయన కుటుంబ సభ్యులు విశాఖ నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యానికి స్పందించిన శ్రీనివాస్ కరోనాను జయించారు. అయితే కరోనాను జయించినప్పటికీ వైరస్ ప్రభావంతో ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆదివారం సాయంత్రం మృతిచెందారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కాగా ఆయన మృత దేహానికి సోమవారం సాయంత్రం 3 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన తనయుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ తెలిపారు. అప్పటి వరకు ప్రజల సందర్శనార్థం ద్రోణంరాజు శ్రీనివాస్ పార్థీవ దేహాన్ని విశాఖలోని పెదవాల్తేర్‌ డాక్టర్స్‌ కాలనీలోని నివాసం వద్ద ఉంచనున్నారు.

ఇక ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం జగన్‌ తెలిపారు.

ద్రోణంరాజు శ్రీనివాస్‌.. దివంగత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు. ఆయన తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం ప్రజల ఆదరాభిమానాలను పొంది రెండు సార్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో సీఎం జగన్‌ ఆయనకు కీలకమైన వీఎంఆర్డీఏ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం ఆయన అదే పదవిలో కొనసాగుతూ తుదిశ్వాస విడిచారు.

Tags:    

Similar News