Palakonda: రసాయన సాగు వద్దు.. ప్రకృతి సాగు ముద్దు!!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు రసాయన సాగు వల్ల కలిగే అనారోగ్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
Palakonda: రసాయన సాగు వద్దు.. ప్రకృతి సాగు ముద్దు!!
పాలకొండ (పార్వతీపురం మన్యం జిల్లా): ప్రస్తుత రసాయన సాగు విధానం వల్ల నేల మాత్రమే కాదు, యావత్ మానవాళి రోగాల బారిన పడుతోందని పాలకొండకు చెందిన అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థల నివేదికలను ఉటంకిస్తూ.. మన ఆహారపు అలవాట్లు, సాగు పద్ధతులు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు.
ప్రసాదరావు విశ్లేషణలోని ముఖ్యాంశాలు:
రోగాలమయం: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం, ఆహారంలో పేరుకుపోతున్న రసాయనిక అవశేషాల వల్ల అంటువ్యాధులు, అసంక్రమిత వ్యాధులు (NCDs) వేగంగా పెరుగుతున్నాయి.
దెబ్బతింటున్న జీవ వైవిధ్యం: అతిగా రసాయనాలు వాడటం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.
ఇంధన ధరల ప్రభావం: ప్రపంచ పెట్రో కెమికల్స్లో 15 శాతం కేవలం ఆహార వ్యవస్థకే వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల మార్పు సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.
ప్రభుత్వానికి మరియు రైతులకు సూచనలు:
ప్రకృతి సాగు అనేది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదని, దీనిని శాస్త్రీయంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రోత్సాహకాలు: ఎరువుల కంటే నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవ వైవిధ్యం పెంపొందించే వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి.
పరిశోధనలు: వ్యవసాయ పరిశోధన కేంద్రాలు నేలలోని సూక్ష్మజీవుల పాత్ర, పశువులు-చెట్లు-పంటల మధ్య ఉన్న అనుబంధంపై దృష్టి సారించాలి.
స్వయం సమృద్ధి: రైతులు పశుసంపదను పెంచుకుంటూ జీవామృతం, వేపనూనె, వేస్ట్ డీకంపోజర్ వంటివి సొంతంగా తయారు చేసుకోవాలి.
"పెట్టుబడి తగ్గించి ప్రకృతమ్మతో మమేకమయ్యే సాగు ద్వారానే బావితరాలకు ఆరోగ్యవంతమైన భూమిని అందించగలం" అని ప్రసాదరావు స్పష్టం చేశారు.