నాగరికతకు దూరంగా బతుకుతున్న గిరిజనుల కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని వారి జీవితాలు దుర్భరస్థితిలో గడుస్తున్నాయి. ఏదైనా రోగం వచ్చినా లేక డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య బతుకీడుస్తున్నారు.
తాజాగా గర్భం దాల్చిన ఓ మహిళను నొప్పులు రావడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తరలించేందుకు డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. ప్రసవ వేదన పడుతున్న తల్లిని, లోకం చూడబోతున్న బిడ్డను రక్షించాలన్న గిరిజనుల ఆరాటం కళ్లకు కట్టింది. వారుంటున్న నివాసాల దగ్గరకు ఎలాంటి వాహనాలు వచ్చేందుకు వీలు లేకపోవడంతో కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సి వస్తుంది.
విశాఖ జిల్లా చింతపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన మన అభివృద్ధిని ప్రశ్నిస్తోంది. డెవలప్మెంట్లో దూసుకుపోతున్నామని చెబుతున్న పాలకులను నిలదీస్తోంది. కనీస సౌకర్యాలు లేక మన్యంలో గిరిజనుల పడుతున్న అవస్థలకు అద్దం పడుతుంది. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు ఇలాంటి ఘటనలు కనిపించకపోవడం శోచనీయం.