రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్వరలో కొత్త గ్రామ స్థాయి కమిటీలను ఎన్నుకునేందుకు టీడీపీ నాయకత్వం సన్నద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 13 జిల్లాలకు నూతన కమిటీలను నియమించాలని ఈ సందర్బంగా నిర్ణయించారు. అన్ని గ్రామాలకు సంబంధించి గ్రామ కమిటీలు పంచాయతీ ఎన్నికలకు ముందే పూర్తవుతాయని సమావేశంలో నేతలకు తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైన కమిటీల సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని కేడర్కు ఆదేశించారు. దాదాపు 60 శాతం గ్రామాల్లో సమావేశాలు పూర్తయ్యాయని నాయకులు ఆయనకు తెలియజేశారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికృత చర్యల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి సహాయం చేయడానికి పార్టీ నాయకులను సిద్ధం చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 6న టీడీపీ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి సమీపంలో కొత్తగా నిర్మించిన టీడీపీ కార్యాలయం ఎన్టిఆర్ భవన్ ను డిసెంబర్ 6 ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని.. పండితుల సూచనల మేరకు టీడీపీ నాయకత్వం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆహ్వానించింది టీడీపీ.