విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. సామాజికంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది వైసీపీ.. కానీ విజయం మాత్రం సాధించలేదు. మొదట కాపు ఆ తరువాత కమ్మ, మళ్ళీ కాపు నేతని రంగంలోకి దింపింది.. కానీ పట్టు మాత్రం సాధించలేకపోయింది. ఇప్పుడు దేవినేని అవినాష్ రాకతో ఆ నియోజకవర్గంలో పార్టీ బలపడుతుందని ఆశలు పెట్టుకుంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే 2014 లో కాపుల్లో బలమైన నేత అయిన వంగవీటి రాదాకు టిక్కెట్ ఇచ్చింది వైసీపీ. కానీ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఆయన ఓటమి చెందారు. అంతకుముందే గద్దె రామ్మోహన్ ఒకసారి విజయవాడ ఎంపీగానూ , గన్నవరం ఎమ్మెల్యేగాను పనిచేశారు. స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉంది. ఆటో యూనియన్ కు అధ్యక్షుడిగా ఉండటమే కాకుండా కార్మికులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారికి అన్ని విధాలా ఆయన అండగా నిలిచారు. కాపు ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నాయి. టీడీపీ కమ్మ నేతకు టిక్కెట్ ఇస్తే.. వైసీపీ మాత్రం కాపు నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో కాపు ఓట్లు పోలరైజ్ అవుతాయని భావించింది. అందులో భాగంగానే 2014 లో వంగవీటికి టిక్కెట్ ఇచ్చారు జగన్. కానీ జగన్ ప్లాన్ రివర్స్ అయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దాంతో కొద్దిరోజులకు వంగవీటి రాదా సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లారు.
ఈ క్రమంలో తూర్పులో కాపు సామాజికవర్గానికే చెందిన బొప్పన భవకుమార్ ను ఇంఛార్జిగా పెట్టింది. కానీ పీకే సర్వేలో ఇక్కడ కమ్మ సామాజికవర్గం నేత అయితేనే బెటరని సూచించడంతో.. టీడీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన యలమంచిలి రవిని వైసీపీలో చేర్చుకున్నారు. కొంతకాలం ఆయనే తూర్పు ఇంఛార్జిగా వ్యవహరించారు. అయితే ఎన్నికల సమయంలో యలమంచిలి రవి ఆర్ధికంగా బలమైన నేత కాదని భావించి.. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావును రంగంలోకి దింపాలనుకుంది. కానీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఎంట్రీతో సీన్ మారింది. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న తనది ఎలాగో కమ్మ సామాజికవర్గమే కాబట్టి తూర్పులో కాపు నేతకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. దాంతో బొప్పన భవకుమార్ కే టిక్కెట్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన కూడా ఓటమి చెందారు. పైగా పీవీపీ ఓటమికి ఈ నియోజకవర్గమే ప్రధాన కారణమైంది. దాంతో ఈ నియోజకవర్గానికి బలమైన కమ్మ సామాజిక వర్గం నేతనే నియమించాలని ఫిక్స్ అయింది వైసీపీ. ఇటీవల పార్టీలో చేరిన దేవినేని అవినాష్ కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. అవినాష్ తండ్రి రాజశేఖర్(నెహ్రు) ఇదే నియోజకవర్గం పరిధినుంచి అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్మ సామాజిక వర్గానికి దేవినేని అవినాష్ అయితేనే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వగలరని భావిస్తోంది వైసీపీ. మరి ఈసారైనా ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి.