Pawan Kalyan: నేడు కొండగట్టుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్

Pawan Kalyan: ధర్మపురి నుంచి నారసింహయాత్రకు శ్రీకారం చుట్టనున్న పవన్

Update: 2023-01-24 02:21 GMT

Pawan Kalyan: నేడు కొండగట్టుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి ఎన్నికలకు రెడీ అయ్యింది. ఇవాళ కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజలు అనంతరం తన మొదటి ప్రస్థానాన్ని ప్రారంభించనుంది పవన్ కళ్యాణ్ వారాహి. తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామికి పూజలు చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనంతో తన సార్వత్రిక సమరాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని అక్కడ స్వామివారికి పూజలు చేసిన తర్వాత, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చర్చించనున్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ అనుసరించే వ్యూహాలు, చేపట్టబోయే కార్యక్రమాలపైన చర్చించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇక సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో లక్ష్మీ నరసింహ క్షేత్రంలో నారసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతారు. ఇక ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ 32 నారసింహ క్షేత్రాలను సందర్శించనున్నారు. ముందుగా ఈ యాత్రలో ఆయన తొలిసారిగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు.

Tags:    

Similar News