నల్గొండలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు హఠాత్తుగా బస్సు దిగడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్కూట్ కు గురైంది. దాంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సు ఆపి అందులో ఉన్న ప్రయాణికులను దిగమని కేకలు వేశాడు. వెంటనే ప్రయాణికులు బస్సు దిగారు. నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరో బస్సు రావడంతో వారంతా అందులో వెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.