Private Hospital in Eluru: కరోనా పేరుతో దోపిడీ.. ఏలూరులో ఆస్పత్రి సీజ్

Private Hospital in Eluru: కరోనా పుణ్యమాని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ పర్వానికి తెరతీశారు..

Update: 2020-08-23 03:42 GMT

Private Hospital in Eluru: కరోనా పుణ్యమాని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ పర్వానికి తెరతీశారు.. కేవలం సీటీ స్కాన్ బూచిగా చూపించి, పాజిటివ్ సోకిందని నమ్మించి, లక్షలు దోచేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఇదే విధానంలో ఇప్పటికే విజయవాడలోని రమేష్ ఆస్పత్రి చేసిన నిర్వాకం పూర్తికాకుండానే సమీపాన ఉన్న ఏలూరు పట్టణంలో మురళీకృష్ణ మల్టీ ఆస్పత్రి తెరపైకి వచ్చింది. దీనిపై ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు, ,రెవెన్యూ అధికారులు వచ్చి ఆస్పత్రిని సీజ్ చేశారు.

అనధికారికంగా కోవిడ్‌ బాధితులకు వైద్యం చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన ఏలూరులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వైద్యాధికారులు శనివారం సీజ్‌ చేశారు. బాధితులు నుంచి మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లక్షలు దోచుకుంటున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆసుపత్రిపై డీఎంహెచ్‌వో, ఏలూరు రెవెన్యూ యంత్రాంగం దాడులు నిర్వహించారు. సుమారు 10 లక్షల విలువైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కూడా సీజ్‌ చేశారు.

ఆసుపత్రికి చేరుకున్న జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ సునంద, ఎమ్మార్వో చంద్రశేఖర్‌, ఆర్డీవోలు విచారణ చేపట్టారు. విచారణలో ఆస్పత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరోనా‌ సోకిన‌ వ్యక్తి కి రెండు లక్షల రుపాయలు గరిష్ఠంగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు. రోజుకు లక్ష రుపాయలు వసూళ్లు చేసినట్లు ధ్రువీకరించారు. వెంటిలేషన్‌ సదుపాయం లేకుండానే రోగుల వద్ద నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కరోనా బాధితుడికి పీపీఈ కిట్‌ పేరుతో రోజుకు రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఆసుపత్రి పై అధికారులు దాడి చేసిన సమయంలో 18 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మరొక ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో విచారణ ఇంకా కొనసాగుతుంది. 

Tags:    

Similar News