Tirumala: తిరుమలలో మద్యం, మాంసం కలకలం
తిరుమలలో అపచారం జరిగింది. ఏడుకొండల పవిత్రకు భగం కలిగేలా కొందరు ప్రవర్తించారు.
తిరుమలలో అపచారం జరిగింది. ఏడుకొండల పవిత్రకు భగం కలిగేలా కొందరు ప్రవర్తించారు. నిబంధనలకు విరుద్దంగా తిరుమలలో మద్యం, మాంసం కొందరు తిన్నారు. తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్ వద్ద స్థానిక బాటగంగమ్మ ఆలయం సమీపంలో కొంతమంది వ్యక్తులు గుంపుగా కూర్చుని మద్యం సేవిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మద్యం సేవిస్తున్న 14మందిని అరెస్ట్ చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన 14 మంది తిరుమల, తిరుపతికి చెందిన వ్యక్తులగా గుర్తించారు. వారి దగ్గర నుంచి మద్యం బాటిల్లను స్వాధీనపరుచుకున్నారు. నిందితులు మాంసం తినే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ 14మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా.. మద్యం బాటిళ్లు, మాంసం ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం తిరుమలకు తీసుకురావడానికి ఎవరు సహకరించారని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో పెద్దలు హస్తమైనా ఉంటే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. తిరుమల పవిత్రతను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.